పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఏడుగురితో కూడిన రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్ లో మరో ఇద్దరూ చోటు దక్కించుకున్నారు. రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ వి.విజయసాయి రెడ్డి మరియు ప్రముఖ అథ్లెట్, ఎంపీ పీటీ ఉషను నియమిస్తున్నట్టు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి, పీటీ ఉషకీ జగ్దీప్ ధన్కర్ అభినందనలు తెలిపారు. అలాగే పీటీ ఉష నామినేటెడ్ ఎంపీ కాగా, రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా తొలిసారిగా ఒక నామినేటెడ్ ఎంపీని నియమించినట్టు తెలిపారు.
మరోవైపు రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ల జాబితాలో గతంలోనే విజయసాయి రెడ్డి పేరు ఉండగా, చివర్లో చైర్మన్ ఆయన పేరును ప్రకటించలేదు. అయితే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. విజయసాయి రెడ్డి, పీటీ ఉష నియామకం డిసెంబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అందుబాటులో లేని సమయంలో వైస్ ఛైర్మన్లు సభను నడిపిస్తారు.
ఈ నియామకంపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ, తనపై అచంచల విశ్వాసంతో రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించిన ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “నా బాధ్యతను అత్యంత ధర్మనిష్టతో నెరవేరుస్తానని విన్నవించుకుంటున్నా. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా నావంతు కృషిచేస్తా” అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE