డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపికైన కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ ను మొదటగా ఈ సిరీస్ కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు దూరం కావడంతో సంజు శాంసన్ కు మరో అవకాశం లభించింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నపుడు శిఖర్ ధావన్ ఎడమ మోకాలికి గాయమైంది. బీసీసీఐ వైద్య బృందం పరిశీలన అనంతరం కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నిర్ధారించుకోవడంతో ధావన్ స్థానంలో సంజు శాంసన్ ను ఎంపిక చేస్తున్నట్టుగా బీసీసీఐ ప్రకటించింది.
బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్కు ఎంపికైన సంజు శాంసన్కు, కనీసం ఒక్క మ్యాచులో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీ20, వన్డే జట్లలో సంజు శాంసన్కు చోటు దక్కకపోవడంతో క్రీడాభిమానులు నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో శిఖర్ ధావన్ కి గాయం కావడంతో శాంసన్ కు టీ20 జట్టులో చోటు లభించింది. చివరిసారిగా సంజు శాంసన్ 2015లో జింబాబ్వేపై టీ20 ఆడాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లలో నిలకడగా రాణిస్తున్న శాంసన్, వికెట్ కీపింగ్ లో కూడా తన ప్రతిభను చాటుతున్నాడు. వెస్టిండీస్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్ లలోనైనా భారత్ తుది జట్టులో సంజు శాంసన్ కు చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. తోలి టీ20 మ్యాచ్ డిసెంబర్ 6న హైదరాబాద్ లో జరగనుంది.