భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 23, బుధవారం నాడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ మినహా మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా బోర్డు పగ్గాలు చేపట్టడం లాంఛనమే కానుంది. సమావేశం అనంతరం బీసీసీఐ నూతన కార్యవర్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
అదేవిధంగా ఇన్ని రోజులు బీసీసీఐ వ్యవహారాలు నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలక కమిటీ సభ్యులైన వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. వారు పనిచేసిన 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.3.5 కోట్లు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సౌరవ్ గంగూలీ తో పాటు బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా, బోర్డు కోశాధికారిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడైన అరుణ్ ధుమాల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.