టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 28, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కలుసుకోనున్నారు. రాజధాని పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసగా ఈ ప్రాంతాన్ని సందర్శించి, రైతులకు భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటివరకు అమరావతిలో జరిగిన పనులు, నిలిచిపోయిన పనులను కూడా చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటనపై అసైన్డ్ భూముల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు పాతారు. బుధవారం రాయపూడిలో అసైన్డ్ భూముల రైతులు నిరసనకు దిగారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ఒక ప్యాకేజీ, పట్టా భూములకు మరొక ప్యాకేజీ ఇచ్చి చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు అమరావతి పర్యటనపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, చంద్రబాబు ఎక్కడా తిరిగిన తమకు అభ్యంతరం లేదని, ఆయన అమరావతి పర్యటనను అడ్డుకునే ఉద్దేశమే లేదని చెప్పారు. అయితే అమరావతిలో పర్యటించే నైతిక అర్హత బాబుకు ఉందో లేదో ఆయనే ప్రశ్నించుకోవాలని సూచించారు. అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి వేల ఎకరాల భూములు తీసుకుని, తిరిగి ప్లాట్లు ఇస్తామని ఇచ్చిన హామీని గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పారు. అలాగే రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వలేదని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాజధాని రైతులకు రూ.108 కోట్లు కౌలుగా చెల్లించామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
[subscribe]