భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డిసెంబర్ 26, గురువారం నాడు ఏడాదిపాటు నిషేధాన్ని విధించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైనందువలన నిషేధాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నామని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. గత అక్టోబర్ నెలలో అతని నుంచి శాంపిల్స్ను సేకరించి పరీక్షలు జరపగా, అందులో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో పొందుపరిచిన ‘ఎసిటజొలమైడ్’ ఉన్నట్లు తేలడంతో ఆర్టికల్ 10.5.1 ప్రకారం అతడిపై ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై నాడా స్పందిస్తూ, అక్టోబర్ 10 న ఎలైట్ మెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సందర్భంగా సాంగ్వాన్ శాంపిల్స్ సేకరించామని, డోప్ పరీక్షల్లో ‘ఎసిటజోలమైడ్’ అనే ఉత్ప్రేరకం ఉన్నట్లుగా తేలిందని అన్నారు. కంటి సమస్యతో బాధ పడుతున్నప్పుడు వైద్యుడు సూచించిన మందుల్లో పొరపాటు ఏదైనా జరిగివుండొచ్చని సుమీత్ తెలిపాడని అన్నారు. కారణాలేవైనా నిషేధిత జాబితాలో ఉన్న ఉత్ప్రేరకాలను క్రీడాకారులు తీసుకోకూడదని, ఆదిశగానే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 2017లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సుమీత్ సాంగ్వాన్ రజతపతకం సాధించాడు. ఇప్పుడు నిషేధం కారణంగా 91 కేజీల బాక్సింగ్ విభాగంలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కు సంబంధించిన అర్హత పోటీలకు నిర్వహించే ట్రయల్స్కు సుమీత్ దూరమయ్యాడు.