భారత జట్టు మాజీ ఓపెనర్, ప్రస్తుత ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్కు గౌతమ్ గంభీర్ పేరు పెట్టాలని ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రాజన్ మంచండా మాట్లాడుతూ, స్టేడియంలో ఒక స్టాండ్ కు గౌతమ్ గంభీర్ పేరు పెట్టే ప్రతిపాదనకు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఇఓను ఆదేశించారని చెప్పారు. జాతీయ మరియు అంతర్జాతీయ క్రికెట్లో గౌతమ్ గంభీర్ చేసిన కృషికి గుర్తింపుగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ‘గౌతమ్ గంభీర్ స్టాండ్’ పెట్టాలని ప్రతిపాదించామని తెలిపారు.
ఈ స్టేడియంలోని ఇప్పటికే ఓ స్టాండ్కి భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. సెప్టెంబరు నెలలో ఇందుకు సంబంధించిన వేడుక కూడా నిర్వహించారు. భారత మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడి, మొహిందర్ అమర్నాథ్ పేర్లు మీద కూడా ఈ స్టేడియంలో స్టాండ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా గౌతమ్ గంభీర్ సైతం ఈ గుర్తింపు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి గౌతమ్ గంభీర్ స్టాండ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భారత్ సాధించిన టీ20, వన్డే ప్రపంచ కప్ లలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ గత సంవత్సరం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగారు. అనంతరం బీజేపీలో చేరి 2019 ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.