క్రికెట్ ప్రపంచకప్ 2019 లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ లో అతిధ్య ఇంగ్లాండ్ తో, ఆస్ట్రేలియా జట్టు తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. 1992 తరువాత, ఇంతకాలానికి అద్భుత పదర్శనతో మళ్ళీ ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఇప్పటివరకు క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో పరాజయం ఎరుగని ఆస్ట్రేలియా జట్టు, ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇంగ్లాండ్లోని బర్మింగ్ హామ్ లోగల ఎడ్జ్ బాస్టోన్ క్రికెట్ మైదానంలో ఈ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు, 6.1 ఓవర్లకి 14 పరుగులు చేసి కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. వోక్స్, ఆర్చర్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ ఆట ప్రారంభంలోనే పట్టు సాధించింది. స్టీవెన్ స్మిత్ (85), కేరి (46) ల పోరాటంతో ఆస్ట్రేలియా 200 పరుగుల మార్క్ దాటింది. చివరికి 49 ఓవర్లకి 10 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్, మొదటినుంచే దూకుడుగా ఆడింది, జేసన్ రాయ్, బెయిర్ స్టో లు ఆస్ట్రేలియా బౌలర్లుకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మొదటి 10 ఓవర్లో 50 పరుగులు చేసారు. 124 పరుగుల వద్ద బెయిర్ స్టో(34) అవుట్ అవ్వగా, సెంచరీకి చేరువుగా వచ్చిన జేసన్ రాయ్(85) 147 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు, అంపైర్ ధర్మసేన నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగాడు. తరువాత వచ్చిన రూట్(49), కెప్టెన్ మోర్గాన్(45) నాటౌట్ గా నిలిచి ఇంగ్లాండ్ జట్టును విజయతీరాలకు చేర్చారు.
అద్భుతమైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా జట్టును కకావికలం చేసిన వోక్స్ కి మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వరుసగా మూడోసారి కూడా ఆతిధ్య జట్టు ఫైనల్ కి చేరుకోవడం విశేషం. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 27 వికెట్లు పడగొట్టి, ఒక ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు, గతంలో ఈ రికార్డ్ మెక్ గ్రాత్ (26) పేరున ఉంది.ఆదివారం జరిగే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్టుతో పోటీ పడనుంది.