అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను అరెస్ట్ చేసారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఒక రైతు నుండి లంచము తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నేరుగా పట్టుబడగా, విచారణ అనంతరం తహసీల్దార్ లావణ్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు దొరకడంతో, అధికారులు ఈ కేసుని మరింత లోతుగా శోధిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు సోదాలు కొనసాగించి, గురువారం ఉదయం లావణ్యను అరెస్ట్ చేసారు, మునిసిపల్ పరిపాలనా విభాగంలో పనిచేసే ఆమె భర్త పరారీలో ఉన్నట్టు సమాచారం.
ముందుగా లావణ్య ఆదేశాలమేరకే వీఆర్వో అనంతయ్య, రైతు నుండి డబ్బు తీసుకున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు, హయత్ నగర్ లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించి రూ. 93 లక్షల నగదు, 40 తులాలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో అరెస్ట్ చేసి నాంపల్లి లోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. విచారణ తరువాత ఆమెను ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు, ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వీఆర్వో అనంతయ్యను కూడ నాంపల్లి సివిల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.