ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రాబోతుందని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా ప్రజా సంకల్పయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి దశల వారీగా రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. నూతన మద్యపాన విధానం ప్రకారం ఇకపై ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. గత నెలలో 475 ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించామని, ఇకనుంచి రాష్ట్రవ్యాప్తంగా 3500 ఏర్పాటు చేసి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వీటిని నిర్వహిస్తామని అన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు మాత్రమే మద్యం దుకాణాల పనివేళలు ఉంటాయని తెలిపారు. ఈ విధానం ద్వారా 3500 మందికి సూపర్ వైజర్లు, 8000 మందికి పైగా సేల్స్ మెన్ ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.
ఏదైనా ప్రాంతంలో ప్రజలు ముందుకొచ్చి మద్యం దుకాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి సీఐ, ఎస్సైలకు 10 దుకాణాల చొప్పున పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత దృష్ట్యా 678 కానిస్టేబుల్ పోస్టులకు ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న బెల్టు షాపులను పూర్తి స్థాయిలో తొలగించామని, అదేవిధంగా నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం మోపి 2834 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మద్యం ధరల విషయంలో ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. పాఠశాలలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు దగ్గరగా మద్యం దుకాణాల ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
[subscribe]