భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1 తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 19, ఆదివారం నాడు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(119) సెంచరీతో అలరించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లి (89) పరుగులతో మరోసారి సత్తా చాటాడు. రోహిత్, కోహ్లీ రెండో వికెట్కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయం వైపు నడిపించారు. రోహిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ దీటుగా ఆడి 44 పరుగులతో నాటౌట్ గా నిలిచి తనవంతు సహకారం అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హజల్వుడ్, అగర్, ఆడమ్ జంపాలు తలో వికెట్ తీశారు.
మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో స్టీవ్స్మిత్(131) సెంచరీతో ఆకట్టుకోగా, మార్నస్ లబుషేన్(54), అలెక్స్ కారే (35) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), ఆరోన్ఫించ్(19) వెంటవెంటనే అవుట్ అవ్వగా, స్మిత్, లబుషేన్ భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కుని పరుగులు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లుతో రాణించగా, రవీంద్ర జడేజా 2 వికెట్లు, కుల్దీప్యాదవ్, నవదీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోగా, విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.