ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 20, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. హైపవర్ కమిటీ నివేదిక, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, ఇతర అంశాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అలాగే రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఏపీ కేబినెట్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు:
- హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
- శాసన రాజధానిగా అమరావతి, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు బిల్లుకు ఆమోదం
- సీఆర్డీఏ రద్దుకు ఆమోదం
- సీఆర్డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా మారుస్తూ నిర్ణయం
- పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లులకు ఆమోదం
- 11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
- రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ, పరిహారాన్ని రూ.2500 నుంచి 5 వేలకు పెంపు
- భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్ల వరకు ఇవ్వాలని నిర్ణయం
- రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
- పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కి ఆమోదం
- ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్తతో విచారణ
- అమరావతిలోనే మూడుసార్లు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ
[subscribe]