- కెప్టెన్ గా 28 టెస్టు విజయాలు సాధించి ధోని రికార్డ్ అధిగమించిన విరాట్ కోహ్లీ
- టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత్ బౌలర్ గా బుమ్రా రికార్డ్
- తోలి శతకం సాధించిన హనుమ విహారి
వెస్టిండీస్ పర్యటనను భారత్ ఘనంగా ముగించింది. మొదటగా టి-20, తరువాత వన్డే సిరీస్ లు గెలుచుకున్న భారతజట్టు 2-0 తో టెస్టు సిరీస్ సైతం కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టు వెస్టిండీస్ కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా భారత ఆటగాళ్లు సత్తా సాటారు. వెస్టిండీస్ తో కింగ్ స్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నాలుగురోజునే భారతజట్టు 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 468 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 59.5 ఓవర్లలో 210 పరుగుల చేసి ఆలౌట్ అయ్యింది. రవీంద్ర జడేజా, షమీ 3వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్ జట్టులో బ్రూక్స్ ఒక్కడే 50 పరుగులు చేసి మెరుగ్గా రాణించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారతజట్టు తోలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసింది. హనుమవిహారి 111 పరుగుచేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 76, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 55, బౌలర్ ఇషాంత్ శర్మ 57 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్ బుమ్రా ధాటికి తోలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. బుమ్రా 6 వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన భారతజట్టు 168 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అజింక్యా రహానే 64, హనుమవిహారి 53 పరుగులు చేసారు. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన వెస్టిండీస్ జట్టు కనీస పోటీ ఇవ్వలేక 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టెస్టులో రిటైర్ హర్ట్ గా మైదానాన్ని వీడిన డారెన్ బ్రావో స్థానంలో కాంకసన్ సబ్ స్టిట్యూట్ గా బ్లాక్ వుడ్ బరిలోకి దిగాడు. ఒక సెంచరీ, అర్ధ సెంచరీతో రాణించిన హనుమవిహారికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టెస్టు సిరీస్ విజయంతో టెస్టు ఛాంపియన్ షిప్ లో భారతజట్టు 120 పాయింట్స్ సాధించి అగ్రస్థానంలో ఉంది. 60 పాయింట్స్ తో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.