తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అక్టోబర్ 4, శుక్రవారం నాడు త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో 5వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, కార్మికులకు ఉద్యోగ భద్రత, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, మోటార్ వెహికల్ టాక్స్ రద్దు, ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపు వంటి అనేక డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. సమ్మె నేపథ్యంలో దాదాపు వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
అయితే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోలీసుల భద్రత మధ్య కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్నారు. అయితే ఈ విధంగా రోడ్లపై కొచ్చిన బస్సులను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నిస్తుండడంతో వారిని పలు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఈ సమ్మెకు సంఘీభావంగా కొన్ని చోట్ల విపక్ష పార్టీల నేతలు కూడ ధర్నాలో పాల్గొంటున్నారు. జరుగుతున్న ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవరించాలని నిర్ణయించుకుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఉద్యోగులు విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు ఎదురుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులు నడుపుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రయాణికుల కోసం ఈ రోజు పూర్తి స్థాయిలో 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
[subscribe]