ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ పై కన్నేసింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదలైన తోలి టెస్టులో, మొదటి రోజు ఆటపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత జట్టు ఓపెనర్లలలో రోహిత్ శర్మ 115 పరుగులతో మొదటి రోజే శతకం సాధించగా, మయాంక్ అగర్వాల్ మొదటి రోజు 84 పరుగులతో నిలిచి, రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దీ సేపటికే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో తోలిరోజు టీ టైం తర్వాత ఒక సెషన్ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారతజట్టు 59.1 ఓవర్లకి ఒక్క వికెట్ కూడ కోల్పోకుండా 202 పరుగులు చేసింది.
వెస్టిండీస్ సిరీస్ లో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ విఫలమైన తర్వాత ఆ స్థానం దక్కించుకున్న రోహిత్ శర్మ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇన్నింగ్ కొనసాగించి, కుదురుకున్నాక తనవైన షాట్లతో అలరించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. రబడా, ఫిలాండర్, డేన్ ఫీట్, సెనురన్ ముత్తుస్వామి, కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో ఎక్కడ తడబడకుండా పరుగులు సాధించారు. వీరిద్దరూ లంచ్ విరామం తర్వాత ధాటిగా ఆడారు. ఇంకా ఆట 30 ఓవర్లు మిగులుండగానే మబ్బలు కమ్ముకుని వర్షం పడడంతో టీ బ్రేక్ నుంచి మ్యాచ్ ను నిలిపివేశారు. రెండో రోజు భారత ఓపెనర్లు అదే ఆట తీరుతో జోరు కొనసాగిస్తున్నారు.