దసరా పండగ నేపథ్యంలో అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు ముందే వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల చివరిలో వేతనాలు అందుతున్నాయి. అయితే ఈ నెలలో దసరా పండగ మొదటి వారంలోనే రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని తెలంగాణ అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాల సంఘం నేతలు అక్టోబర్ 1, మంగళవారం నాడు గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి పండగ కోసం వేతనాలు ఇప్పించాలని కోరారు. అంగన్ వాడీల విజ్ఞప్తిని మంత్రి సత్యవతి రాథోడ్, ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి పండగ కోసం అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రి వేతనాల నిమిత్తం 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్ వాడీ ఉద్యోగులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అని సత్యవతి రాథోడ్ అన్నారు. గత పాలకులు వేతనాలు పెంచమని అడిగిన అంగన్ వాడీ ఉద్యోగులను గుర్రాలతో తొక్కిస్తే, తమ ప్రభుత్వం వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని చెప్పారు. పండగ కోసం వేతనాలు ఇవ్వమని అడిగిన ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసిన మనసున్న ప్రభుత్వమని కొనియాడారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు. ఈ నెల 21వ తేదీన హుజూర్ నగర్ లో జరిగే ఉప ఎన్నికల్లో మహిళలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.
[subscribe]