ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 273/3 తో ఆట కొనసాగించి మరో 328 పరుగులు జత చేసిన భారత జట్టు తోలి ఇన్నింగ్స్ ను 601/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. అజింక్య రహానే 59 పరుగులు చేసి అవుట్ అవ్వగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 254 పరుగులతో టెస్టుల్లో తన ఏడవ డబుల్ సెంచరీని నమోదు చేసాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ జట్టు స్కోర్ ను పరుగులు పెట్టించి తన టెస్టు కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని సాధించాడు. ఈ డబుల్ సెంచరీతో కోహ్లీ టెస్టుల్లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 138 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. కోహ్లీకి తోడుగా రవీంద్ర జడేజా కూడ 104 బంతుల్లో 91 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా అవుట్ అయ్యాక 601/5 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కసిగో రబడా 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ నిలువలేక పోయారు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఓపెనర్ మార్కరమ్ పరుగులు లేమి చేయకుండానే వెనుదిరగగా, మరో ఓపెనర్ ఎల్గర్ 6 పరుగులతో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం షమీ బౌలింగ్ లో బవుమా 8 పరుగుల వద్ద కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి డి బ్రూయిన్ (20), నోర్జె (2) బ్యాటింగ్ చేస్తూ క్రీజ్లో ఉన్నారు.