తెలంగాణ పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి రామారావు అక్టోబర్ 11, శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లి గ్రామంలో , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి లాజిస్టిక్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణలో మొట్టమొదటి లాజిస్టిక్ పార్కు ఇదేనని, త్వరలో బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్కు ప్రారంభం కానుందన్నారు. ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుందని, అదే విధంగా కుంట్లూరులో ఎన్టీపీ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ముచ్చర్లలో త్వరలో ఫార్మా క్లస్టర్ రానుందని, 162 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కు ఇరువైపులా ఎన్నో పరిశ్రమలు స్థాపించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ ప్రాంతాలకు పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీరు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో 8 లాజిస్టిక్ పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.40 కోట్లు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలో లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. టిఎస్ ఐపాస్ కింద సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు వెంటనే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గానికి అతిపెద్ద లాజిస్టిక్ పార్కు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఒక్కో మునిసిపాలిటీకి రూ.10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాసరెడ్డి, కొడంగల్ ఎంఎల్ఏ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మెన్ అనితా రెడ్డి, ఆంకాన్ లాజిస్టిక్ పార్కు ఎండీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
[subscribe]