వెస్టిండీస్ తో జరిగిన మూడవ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షము వలన రద్దు అవగా, రెండు, మూడవ వన్డేలు గెలుచుకుని భారత జట్టు సిరీస్ గెలుచుకుంది. మూడవ వన్డేలో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు క్రిస్ గేల్ 72 పరుగులతో, లూయిస్ 43 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లను దీటుగా ఎదురుకుని సిక్స్ లు, ఫోరులతో అలరించారు. ఆట 22 ఓవర్లకి చేరుకోగానే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 35 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. వెస్టిండీస్ జట్టు 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు, షమీ 2 వికెట్లు పడగొట్టారు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ణయించారు.
తరువాత ఛేజింగ్ కి దిగిన భారత జట్టు మూడో ఓవర్లోనే రోహిత్ శర్మ (10) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 13 ఓవర్లో 36 చేసి అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన రిషబ్ పంత్ సైతం పరుగులేమి చేయకుండా వెంటనే అవుట్ అవ్వడంతో 92 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. 65 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీతో కలిసి 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొదటినుంచి దూకుడుగా ఆడుతున్న కోహ్లీ వన్డేల్లో తన 43వ సెంచరీ సాధించాడు. 99 బంతుల్లో 114 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచి 33వ ఓవర్ లోనే జట్టుకు అద్భుత విజయం చేకూర్చాడు. వెస్టిండీస్ బౌలర్ ఫాబియన్ అలెన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ టూర్లో భారతజట్టు వెస్టిండీస్ తో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. మొదటి టెస్టు మ్యాచ్ ఈ నెల 22న అంటిగ్వాలో జరగనుంది.