టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ పత్రాలను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వి.ఎస్.సంపత్కు సమర్పించారు. గతంలో కూడ అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్ష పదవికి పోటీపడగా నామినేషన్ ను తిరస్కరించారు. 2017లో ఒకసారి అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, జీవితకాలం పాటు నిషేధం వంటి కారణాలతో అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ ను తిరస్కరించారు.
బీసీసీఐ అప్పటికే అజారుద్దీన్ పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసి క్లీన్చిట్ ఇచ్చినా, అందుకు సంబంధిన పత్రాలు నామినేషన్ దాఖలు చేసే సమయంలో సమర్పించకపోవడంతో వివాదస్పదంగా మారి, అనుకోని పరిస్థితుల్లో అధ్యక్ష పదవి పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ పరిణామాల మధ్య మళ్ళీ 2019లో తిరిగి అధ్యక్ష పదవికి పోటీచేస్తానని అజారుద్దీన్ అప్పుడే ప్రకటించారు. ఈసారి నామినేషన్ కు ముందే తగిన హోమ్ వర్క్ చేసి బరిలోకి దిగినట్టు సమాచారం. సెప్టెంబర్ 27న హెచ్సీఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి మరోసారి బరిలోకి దిగారు. ఆయన గురువారం నాడు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసారు.