కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ జరుగుతున్నపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఉండకపోవడం సరైన పద్ధతి కాదని, ఆ విషయం తన పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించేందుకే అసెంబ్లీకి వచ్చానని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవడానికి తన పార్టీ నాయకులు వెళ్లారని అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. శాసనసభ సమావేశాలు 14 రోజులకంటే తక్కువుగా జరిగితే చెల్లదని అసెంబ్లీ రూల్స్ బుక్ లోనే నిబంధన ఉందని అన్నారు. రెండుపార్టీలు నిర్ణయం తీసుకుంటే సరిపోదని, 14 రోజుల కంటే తక్కువ రోజులు సభ జరగడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో పదవి ఎప్పుడు వరిస్తుందో ఎప్పడు పోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలలో అధిష్టానం ఇంకా ఎవరికీ టికెట్ కేటాయించలేదని అన్నారు. ఆ స్థానానికి తాను శ్యామల కిరణ్ రెడ్డిని ప్రతిపాదిస్తునట్టు తెలిపారు. యురేనియంపై తమ పార్టీ నేత సంపత్ కుమార్ కు ఏబీసీడీ లు కూడ తెలియవని, పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగేందుకు సంపత్ కు అవకాశం రాలేదని, ఆ కోపం తనపై చూపిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై తన దగ్గర ఉన్న ఆధారాలను త్వరలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కు అందజేస్తానని చెప్పారు. ఇటీవలే హుజూర్ నగర్ అసెంబ్లీ టికెట్ ను తన సతీమణి ఉత్తమ్ పద్మావతికి కేటాయిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ రోజు వేరే పేరు ప్రతిపాదించడంతో వారిద్దరి మధ్య ఉన్న విబేధాల గురించి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది.
[subscribe]