తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో మరోసారి సమావేశం కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలన్నింటిని పరిష్కరించుకోవడానికి గతంలో కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ చర్చల కొనసాగింపు కోసం మరోసారి ఈ నెల 24న సమావేశమవ్వాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర విభజన సమస్యలు, కృష్ణ గోదావరి జలాల తరలింపు వంటి అనేక అంశాలపై ఇరువురి మధ్య మూడు సార్లు చర్చలు జరిగాయి. కొన్ని అంశాలకు సంబంధించి అంగీకారం తెలుపుకుని పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
గోదావరి కృష్ణా జలాల వినియోగం, కొన్ని విభజన సమస్యలు, మరికొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఉత్తర్వులు ఇవ్వడం, కొన్ని కొత్త నిర్ణయాలు తెసుకోవాల్సిన నేపథ్యంలో వెంటనే సమావేశమయ్యి సత్వరంగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు, నిధుల విడుదల తదితర అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై కూడ వచ్చే సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉంది.
[subscribe]