రైతు భరోసా పథకాన్ని, కేంద్ర పథకమైన పీఎమ్ కిసాన్ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన పార్టీ భావిస్తుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.12,500 అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రచారంలో నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో ఈ పథకాన్ని రూపొందిస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున రైతులకు అందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఒకవేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే అందుకు గల కారణాలను రైతులకు చెప్పి, వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఎన్నికల ప్రణాళికను తూచ తప్పకుండా అమలు చేయాలన్నారు. ఇక రైతు భరోసా పథకం లబ్ధి దారులు ఎంపికలో గందరగోళం నెలకొందన్నారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షలమంది రైతులు ఉండగా, కేవలం 40 లక్షలమందికి మాత్రమే అమలు చేయడం అన్యాయమని చెప్పారు. కౌలు రైతుల ఎంపికలో కూడ నిబంధనలు సవరించాలని చెప్పారు. అంతే కాకుండా ఈ పథకం కింద ఇచ్చే సొమ్మును మూడు విడతలుగా కాకుండా రబీ,ఖరీఫ్ రెండు విడతల్లో అందజేయాలని జనసేన పార్టీ కోరుతుందని చెప్పారు.
[subscribe]