ప్రపంచకప్ తో భారత జట్టు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే, అయితే ఆగస్ట్ 3 నుంచి మొదలయ్యే వెస్టిండీస్ టూర్ వరకు కోచ్ గా రవిశాస్త్రి పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. భారత జట్టుకు కొత్త కోచ్ నియామకం కొరకు బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది. జూలై 30తో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి గడువు ముగిసింది. రవిశాస్త్రిని మళ్ళీ పరిగణిస్తూ, మరో ఆరుగురిని ఎంపిక ప్రక్రియకు పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం. కొత్తగా ఏర్పాటైన క్రికెట్ సలహా కమిటీ త్వరలోనే సమావేశమై ఈ దరఖాస్తులను పరిశీలించి కొత్త కోచ్ ను ఎంపిక చేయనున్నారు.
మాజీ భారత ఆటగాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ మరియు గతంలో భారత జట్టుకు మేనేజర్ గా పనిచేసి, ప్రస్తుతం జింబాబ్వే కోచ్ గా ఉన్న లాల్ చంద్ రాజ్ పుత్ లు కోచ్ రేసులో నిలిచారు. ఎంతో అనుభవమున్న టామ్ మూడీ, న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ కూడ దరఖాస్తు చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ స్టార్ జాంటీ రోడ్స్, భారత్ ఫీల్డింగ్ కోచ్ పదవిపై ఎప్పటినుంచో ఆసక్తి కనబరుస్తున్నాడు, ఈసారి ఆ పదవికి రేసులో ఉన్నాడని తెలుస్తుంది. కోచ్ టీం లో సహాయంగా ఉండే బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ పదవులకు కూడ ప్రముఖ ఆటగాళ్లు దరఖాస్తు చేసినట్టు తెలుస్తుంది. 2020లో జరగబోయే టి-20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపికలు చేయాలనీ బీసీసీఐ భావిస్తుంది.