హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సభలో హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో కొత్తగా హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలోని 7 మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది. ఇంతకాలం కోదాడ రెవెన్యూ డివిజన్ లో ఉన్న హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలతో పాటు సూర్యాపేట రెవిన్యూ డివిజన్లో ఉన్న గరిడేపల్లి, పాలకీడు, నేరేడుచర్ల మండలాలను కలిపి హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ పై సూచనలు, అభ్యంతరాల స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు.
[subscribe]