భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్, టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్వన్గా నిలుస్తూ 2019 ని ముగించాడు. ఐసీసీ తాజాగా డిసెంబర్ 24, మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కొనసాగించాడు. టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ల్లో 928 పాయింట్లుతో, వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ల్లో 887 పాయింట్లుతో టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (864)కు మూడో స్థానం దక్కింది. భారత బ్యాట్స్మెన్లోచటేశ్వర్ పుజారా 4వ, అజింక్య రహానే 7వ స్థానంలో నిలువగా, మయాంక్ అగర్వాల్ 12వ, ఓపెనర్ రోహిత్ శర్మ 15వ స్థానంలో నిలిచారు.
ఇక టెస్టుల్లో బౌలర్ల జాబితాలో ఆ్రస్టేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ నంబర్వన్ స్థానంలో ఉండగా, కసిగో రబడా(దక్షిణాఫ్రికా), నైల్ వాగ్నర్(న్యూజిలాండ్) రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు ఆరోస్థానం దక్కింది. మరో వైపు టెస్టుల్లో ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) టాప్ ర్యాంక్ సాధించగా, రవీంద్ర జడేజా (భారత్), బెన్ స్టోక్స్(ఇంగ్లాండ్) రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. అలాగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 360 పాయింట్లతో భారత్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 216 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.