వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు నేడు చివరిదైన మూడవ వన్డే ఆడనుంది. మొదటి వన్డే వర్షము వలన రద్దు అవగా, రెండో వన్డేలో గెలిచి భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ టూర్ లో మంచి ఆట తీరు ప్రదర్శిస్తున్న భారతజట్టు మూడో వన్డేలో కూడ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనీ భావిస్తుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ఇప్పటికే వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించిన క్రిస్ గేల్ కు ఘనంగా వీడ్కోలు చెప్పాలని వెస్టిండీస్ జట్టు భావిస్తుంది. క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ అఫ్ స్పెయిన్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
భారతజట్టులో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం, అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ పై చర్చ జరుగుతుంది. వరుసగా విఫలమవుతున్న శిఖర్ ధావన్ ఒత్తిడిలో ఉన్నాడు, ఈ మ్యాచ్ లో తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెండవ వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ జోరుమీదున్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ రాణించండంతో నాలుగవ స్థానంలో రిషబ్ పంత్ ను ఆడించడంపై మళ్ళీ మాజీ సీనియర్ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. సంయమనం లేకపోవడం, వికెట్ తొందరగా ఇచ్చేయడం వంటి లక్షణాలు రిషబ్ పంత్ కు అవరోధాలుగా మారుతున్నాయి, దూకుడుగా ఆడే అతని ఆట స్వభావానికి ఐదో స్థానమే సరైనది అని భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ పర్యటనలో భారత బౌలర్లు ఆకట్టుకునేలా రాణిస్తున్నారు. వన్డే సిరీస్ ముగిసాక భారతజట్టు వెస్టిండీస్ తో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. మొదటి టెస్టు మ్యాచ్ ఈ నెల 22న అంటిగ్వాలో జరగనుంది.