తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో నిర్వహించే ఈ సమావేశం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో నీటిపారుదల రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నీటి పారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై డిసెంబర్ 5న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉండడంతో, 37 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా బ్యారేజి, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని సీఎం కేసీఆర్ సమీక్షలో నిర్ణయించారు. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లుపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మరియు బడ్జెట్, కొత్త రెవెన్యూ చట్టం, ఇటీవల ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ములుగులో నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీని, హార్ట్ కల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. తమిళనాడు మెట్టుపాలెంలో అక్కడి ప్రభుత్వం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేసింది. దాని ఫలితంగా దాదాపు 120 మంది ఐఎఫ్ఎస్ అధికారులుగా ఎంపికయ్యే అవకాశం దక్కింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మొట్టమొదటిసారిగా 2016లో తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కాలేజ్ కోసం ములుగులో విశాలమైన ప్రాంగణంలో భవన సముదాయాన్ని నిర్మించారు. ఈ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 11న ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఉద్యానవనాల అభివృద్ధి, పరిశోధన కోసం ములుగులో హార్ట్ కల్చర్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీని కూడా సీఎం కేసీఆర్ అదే రోజున ప్రారంభిస్తారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
[subscribe]