భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగస్టు 23, శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాత్రి 11.30 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా కు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మరియు ఇతర బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.
శనివారం ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ కు హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అమిత్ షా ఈ సందర్భముగా గౌరవ వందనం స్వీకరించారు. 70వ బ్యాచ్ లో 92 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ బ్యాచ్ నుండి తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున కేటాయించనున్నారు. ఈ సందర్భముగా అమిత్ షా మాట్లాడుతూ 70వ ఐపీఎస్ బ్యాచ్ లో 12 మంది మహిళలు ప్రొబేషనరీలుగా శిక్షణ పూర్తి చేసుకోవడం దేశానికే గర్వకారణమని చెప్పారు. దేశం కోసం ఎంతో చేయాలని, ఐపీఎస్ ఆఫీసర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కోరారు. దేశంలో సివిల్స్ ప్రవేశపెట్టింది వల్లభాయ్ పటేల్ అని, ఆయన పేరుతో జాతీయ పోలీస్ అకాడమీ రావడం సంతోషమైన విషయమని చెప్పారు. వల్లభాయ్ పటేల్ తరహాలోనే భారత ప్రధాని నరేంద్రమోడీ జమ్మూ కశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్-370 రద్దు చేసి విజయవంతమయ్యారని అమిత్ షా పేర్కొన్నారు.
[subscribe]
[youtube_video videoid=dC0hDXVf_ac]