జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జనసేన పార్టీ నాయకులు రెండు చోట్ల సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం నాడు ఫిర్యాదు చేసారు. వైసీపీ ఆఫీషియల్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని, పార్టీ మీద ఎవరు తప్పుడు ప్రచారాలకు పాల్పడిన చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. వచ్చే బర్త్ డే సందర్భంగా రూ. 2వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం శంకర్ గౌడ్ మాట్లాడుతూ, పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మాటిచ్చారని చెప్పారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులు సైతం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద చెడు ప్రచారం చేస్తుందని, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మోసపూరిత కుట్రపూరిత సందేశాలను పంపిస్తూ నాయకుడి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసున్నారని జనసేన నాయకుడు పోతిన మహేష్ ఆరోపించారు. పార్టీపై చెడు ప్రచారం చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=zj2hqOzgllI]