ఎన్నికల కోడ్ కూయగానే.. పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనల అమల్లో భాగంగా తనిఖీలు మొదలుపెట్టేశారు. రూ. 50 వేలకు మించి నగదు కానీ.. అధిక బంగారం, వస్తువులు కానీ.. సరైన పత్రాలు లేకుండా తరలిస్తుంటే.. సీజ్ చేస్తున్నారు. ఆధారాలు చూపిన అనంతరం.. వాటిని మళ్లీ అప్పగిస్తున్నారు. లేదా ఐటీ శాఖకు అందజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టలు వెలుగుచూస్తుండడం.. ఇంతింత డబ్బు రోజూ పట్టుబడుతుండడం సామాన్యులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఈనెల తొమ్మిదో తేదీ నుంచే లక్షలకు లక్షలు బయటపడుతూనే ఉన్నాయి. అంటే కరెన్సీ పంపిణీ అనేది నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఇది ఒక వైపు దృశ్యం.
మరోవైపు నోట్ల కట్టలు లెక్కలేసుకొని, ఎన్ని కోట్లున్నది అంచనా వేసి, ఇంకెన్ని కోట్లు ప్రజలకు పంపిణీ చేయగలరో పరిగణనలోకి తీసుకొని పార్టీలు టిక్కెట్లిస్తున్నాయి. ప్రజలందరికీ నోట్లను, బంగారాన్నీ , ఇతరత్రా కానుకల్ని పంపిణీ చేసేందుకు అన్ని పార్టీలు, నేతలు తెగ తాపత్రయపడుతున్నారు. అవన్నీ గుట్టుగా చేయాలి కనుక నానా తిప్పలు పడుతున్నారు.
ఇలాంటి దృశ్యాల్ని చూసే పేరు వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయని ఓ అధికారి ఇలా వ్యాఖ్యానించారు. ‘‘ నియోజకవర్గాల వారీగానే పోటీ పెట్టే బదులు ఎవరెక్కువ పాట పాడితే వారిని ఎమ్మెల్యే చేస్తే పోలా ? మాకూ ఈ తిప్పలు తప్పేవి.’’అని. వేలంలో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. ఆ నిధులతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అటు ప్రజలకు పనులు జరుగుతాయి. ఇటు ప్రభుత్వ ఖజానాపై భారం ఉండదు అన్నారు. సూచన బాగానే ఉంది కానీ నియోజకవర్గాన్ని కొనుక్కున్న ఎమ్మెల్యేకు దక్కేదేమిటి ? అంటే.. నియోజకవర్గంలోని మద్యం దుకాణాల లైసెన్సుల నుంచి మొదలు పెడితే పనులన్నింటి కాంట్రాక్టులు వారి మనుషుల కిచ్చేయాలి. అంతేకాదు ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకందే ప్రయోజనాలూ ఆయన ద్వారా పంపిణీ చేయడమే. వినడానికి తమాషాగా ఉన్నా ఆలోచిస్తే ప్రస్తుతం జరుగుతున్న దానికీ ఆయన చెప్పినదానికీ పెద్ద తేడా ఏమీ లేదని మరో అధికారి వ్యాఖ్యానించారు.
భవిష్యత్లో ఇలాంటివి జరిగేందుకు ఆస్కారముంటుందో లేదో తెలియదు కానీ ప్రజాస్వామ్యమని మనం అనుసరిస్తున్న వ్యవస్థలోనే ఏదీ నిజాయితీగా జరగకపోవడమే విస్తు గొల్పుతోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే వారు రూ. 40 లక్షలకు మించి ఖర్చు చేయరాదంటారు. అణాకానీ పైసలతో లెక్కలు చూపాలంటారు. .
ఇవన్నీ పకడ్బందీగా చేస్తున్నామంటారు. వాస్తవంగా జరుగుతున్నదేమిటో అందరికీ తెలుసు. వాటిని పట్టుకునేందుకు మరో నిఘా ఉండాలి. ఓట్లు కొనొద్దంటారు. నోట్లు పంచొద్దంటారు. ప్రమాణాలు చేద్దామంటారు. సమస్త యంత్రాంగం నిద్రలేని రాత్రులు గడుపుతుంది. నోట్లుపంచుతారు. మద్యంలో ముంచుతారు. అన్నీ దొరుకుతాయి. పాటించాల్సిన నియమాల్ని పాటించరు. నిబంధనల్ని అనుసరించరు. అన్నీ అతిక్రమిస్తారు. పోటీ చేసేవారే సక్రమంగా ఉండరు. వారు ఉండరని తెలిసే వారికోసం సమస్త ప్రభుత్వ పాలనాయంత్రాంగాలు పనిచేయాలి. పట్టుకోవాలి.ఇన్ని వంచనలతో జరిగే ఎన్నికల్లో నిజంగా ప్రజలే నేతల్ని ఎన్నుకుంటున్నారా ? అంటే అనుమానమే.
నోటు కోసమే.. ఇతర వాటి కోసమే.. ఓట్లు వేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సొంత ఆలోచన లేకుండా పోలింగ్కు వెళ్తున్నప్పుడు ఎందుకీ ఎన్నికలు ? అంతా మాయ! సవ్యంగా జరుగుతున్నట్లు భ్రమ. ఇలా జరుగుతున్న చర్చకు ఇక అంతుండదు అనుకున్నాడో ఏమో కానీ మన వ్యవస్థలో జరుగుతున్నవీ అనధికార వేలం పాటలే అంటూ ముక్తాయింపునిచ్చాడు మరో అధికారి. ఈ ప్రస్తావనంతా ఎందుకొచ్చిందీ అంటే ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా నగదు, నగలు, ఉచితాలు పట్టుబడ్డాయి. వ్యక్తుల వద్దే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇతర రాష్ట్రల నుంచీ నిధులు పారుతున్నాయి. దాదాపు పది రోజుల్లోనే వందకోట్లకు పైగా విలువైన నగదు, అభరణాలు, నార్కోటిక్స్, లిక్కర్, ఉచితాలు, తదితరమైనవి పట్టుబడుతున్నాయి. ఎన్నికల వేళ పట్టుబడుతున్న ఈ సొమ్మంతా ఓట్ల కొనుగోలు కోసమేనా.. అన్న చర్చ జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ