తెలంగాణ ప్రభుత్వం హోం ఐసోలేషన్ పేషంట్లకు అందిస్తున్న టెలి మెడిసన్ సేవలు, వారి పర్వవేక్షణను చేపట్టడానికి వినూత్న పద్దతిలో హితం ఆప్ ను ప్రవేశ పెట్టినందుకు నీతి ఆయోగ్ సభ్యులు డా.వినోద్ కుమార్ పాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. డా.పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ ఆహుజా, డా.రవీంద్రన్ తో కూడిన కేంద్ర బృందం ఈ నెల 9,10 తేదిలలో కోవిడ్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన విషయాలపై రాష్ట్ర అధికారులతో చర్చించేందుకు హైదరాబాద్ లో పర్యటించారు. అనంతరం బిఆర్ కెఆర్ భవన్ లో కేంద్ర బృందం సభ్యులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా డా. వి కె. పాల్ మాట్లాడుతూ, హితం ఆప్ వివరాలతో పాటు రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై చేపట్టిన మంచి పనులను ఇతర రాష్టాలతో షేర్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో టెస్టింగ్ ను పెంచారని ఇది వైరస్ కంట్రోల్ కు కీలకమని అన్నారు. వైరస్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తాయని, కోవిడ్ కర్వ్ ప్లాటనింగ్ కు చేపట్టవలసిన చర్యలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రుల సన్నద్ధత స్థాయి, వైరస్ నివారణ చర్యలు, రోగులకు చికిత్స లాంటి అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నదని, ప్రజల ప్రాణాలు కాపడాటానికి 24 గంటలు పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో టెస్టింగ్ , కోవిడ్ ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైరస్ నివారణకు కేంద్ర బృందం సూచనలు ఇచ్చిందన్నారు.
ఈ రోజు ఉదయం కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీనియర్ అధికారులు, జి.హెచ్.యం.సి అధికారులు, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో రాష్ట్రంలో కోవిడ్ పరిస్దితిపై సమీక్షించారు. కేంద్ర బృందం ఢిల్లీలో వైరస్ నివారణకు చేపట్టిన చర్యలపై ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర బృందానికి తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో టెస్టింగ్ లను ప్రతిరోజు 40 వేలకు పెంచాలనీ అధికారులను ఆదేశించి కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించిన సంగతిని కేంద్ర బృందానికి వివరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu