తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, టీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని మొక్కలు నాటారు.
ముందుగా నాగోల్ వద్ద మూసీ నది తీరంలో ఎంపీ సంతోష్ కుమార్, స్థానిక ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తో మొక్కలు నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఇంటివద్ద మొక్కలు నాటారు.
ఇక మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ ఎంపీ కేశవరావు జలవిహార్ లో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లాలో, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీనటులు శ్రీకాంత్, ప్రభాకర్ తో కలిసి ఖమ్మం లకారం ట్యాంకుబండ్ వద్ద కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పలు దేశాలలోని సీఎం కేసీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ