తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క శనివారం తన పాదయాత్ర షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. గాంధీభవన్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ యాత్ర కొనసాగింపుగా మార్చి 16 నుంచి పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించారు. జూన్ 15 వరకు మొత్తం 91 రోజులపాటుగా తన పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజరహత్నూర్ మండలం, పిప్రి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు తన పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
“రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసింది. ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం ఇచ్చి వారికి మేము అండగా ఉన్నామని చెప్పడానికే నేను పాదయాత్ర చేస్తున్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పాదయాత్రలో ప్రజలకు ధైర్యం చెబుతాం. 2023- 24 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తాం. దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ కుప్ప కూల్చింది. ప్రధాని తన స్నేహితులైన క్రోనీ క్యాపిటల్ లిస్టులకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారు. బీజేపీ నాశనం చేస్తున్న ఈ దేశాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా చేస్తున్న పాదయాత్ర ద్వారా ప్రతి గడపగడపకు తీసుకువెళ్తాం కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గం అని ఇంటింటికి చెప్తాం” అని భట్టి విక్రమార్క అన్నారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేస్తున్న పాదయాత్రలో అన్ని జిల్లాల అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ సభ్యులు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములు చేసే పర్యవేక్షణ ఏఐసిసి నిర్వహిస్తున్నదన్నారు. పాదయాత్ర లో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయని, ఈ బహిరంగ సభలకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురావడానికి ఏఐసీసీ ఇన్చార్జిలు కసరత్తు చేస్తున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎల్పీ నాయకుడిగా తెలంగాణలో పాదయాత్ర చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నాను. మీ శక్తి మేరకు నాతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బలోపేతం చేయాలని భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. ఈ మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసిసి కార్యక్రమాలు అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE