తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్లీనరీకి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలనం చేసి ప్లీనరీని ప్రారంభించనున్నారు. ఈ ప్లీనరీలో పాల్గొనటం కోసం 33 జిల్లాల నుంచి 3500 మంది ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. కేంద్రం విధానాలపై మరియు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమంపై 11 కీలక తీర్మానాలను ఆవిర్భావ వేదిక ఆమోదించనున్నది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మరియు వచ్చిన అతిథులకు అన్ని సదుపాయాలు కల్పించడానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నేతృత్వంలో పలు కమిటీలు ఏర్పాటయ్యాయి.
స్వతంత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏప్రిల్ 27, 2001న ఏర్పాటైన టీఆర్ఎస్, 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ విభజనతో తన లక్ష్యాన్ని సాధించింది. నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరుగుతున్న వేడుకల్లో.. తెలంగాణ అభివృద్ధి నమూనాను, గత ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శించనున్నారు. గత ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతు బంధు, దళిత బంధు, ధరణి, కంటి వెలుగు, కేసీఆర్ కిట్స్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పింఛన్లు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటివి ప్రధానమైనవి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు సీఎం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ