రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, వైద్య సిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ఏప్రిల్ 1, బుధవారం నాడు ప్రగతి భవన్ లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్ డౌన్ ను ప్రజలు విజయవంతం చేయాలి. మరికొద్ది రోజుల పాటు ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరుపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారికి, వారి వల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని అధికారులు సీఎంకు తెలిపారు. ” బుధవారం జరిపిన పరీక్షల్లో 30మందికి వైరస్ సోకినట్లు తేలింది. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్ సోకి మరణించారు. దీంతో తెలంగాణలో ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. ఈ 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు, వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు, ఎవరూ చనిపోలేదని” అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తుంది. మర్కజ్ కు వెళ్లివచ్చిన మరో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సిఎం కేసీఆర్ వెల్లడించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పిపిఇ కిట్స్, ఎన్ 95 మాస్కులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు, అజిత్రో మైసిన టాబ్లెట్లు సిద్దంగా ఉంచినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ ను కూడా సిద్ధంగా ఉంచినట్లు. వ్యాధి వచ్చిన వారికి వైద్యం అందించడానికి, వైద్యం అందిస్తున్న మెడికల్ సిబ్బంది భద్రతకు, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలును ప్రభుత్వం తీసుకుంటున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
[subscribe]