తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జీతాల్లో 75%, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల్లో 60%, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల జీతాల్లో 50%, రిటైర్డ్ ఉద్యోగులు పింఛన్ లలో 50% మరియు నాల్గవ తరగతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాలలో 10% కోత విధిస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేషమైన కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మార్చి నెలలో పూర్తి వేతనం చెల్లించాలని ఏప్రిల్ 1 , బుధవారం నాడు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్) కూడా అందించాలని నిర్ణయించారు. ఇన్సెంటివ్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, వైద్య సిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
[subscribe]