ఈ ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేడనీ, సమస్యలను అధిగమిస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “ప్రపంచ వికలాంగుల దినోత్సవం” సందర్భంగా సీఎం దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మన్యూనతకు లోనుకాకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.
దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగుల (వికలాంగుల) శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ.500 ల పెన్షన్ తో సరిపడితే, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి 3,016 రూపాయల పెన్షన్ ను అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నామని సీఎం తెలిపారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం, దళితబంధు పథకాలతో పాటు, ఇతర పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్ ను అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్ తో పాటు మెటీరియల్, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం తెలిపారు.
దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు, త్రీ వీలర్ స్కూటీలు, చేతికర్రలు మొదలైనవి సమకూరుస్తూ రోజువారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. ఇలా అవకాశమున్న ప్రతీ చోట వారి దివ్యాంగుల అత్మ గౌరవాన్ని, అత్మ స్థైర్యాన్ని, సాధికారతకు పెంచే దిశగా, అవసరమైన అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని సీఎం తెలిపారు. రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని చెప్పారు. దివ్యాంగులను మనలో ఒకరుగా ఆదరిస్తూ, వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE