పశ్చిమ బెంగాల్లో ఘోరం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడి ఇంటిలో బాంబు పేలుడు జరిగింది. తూర్పు మేదినీపూర్లో ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు మిడ్నాపూర్లోని కాంటాయ్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇది జరిగింది. భూపతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగబన్పూర్ బ్లాక్ 2లోని నార్యబిలా గ్రామంలో పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో నార్యబిలా గ్రామంలోని తృణమూల్ కాంగ్రెస్ బూత్ అధ్యక్షుడి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ముగ్గురు మృతి చెందగా, ఇంకొందరు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే పేలుడుకు కారణం ఇంకా నిర్ధారించబడలేదని, దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కాగా ఈ పేలుడు ప్రభావం చాలా శక్తివంతమైనదిగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటనలో ఇల్లు పైకప్పు ఎగిరిపోయింది. టీఎంసీ సీనియర్ నాయకుడు, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ శనివారం తూర్పు మేదినీపూర్లో ర్యాలీ నిర్వహించడానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. తృణమూల్ నాయకుడి ఇంటి వద్ద కంట్రీ మేడ్ బాంబులు తయారవుతున్నాయని ఆరోపించింది. ఈ పరిణామంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందని అన్నారు.
అలాగే సీపీఐ (ఎం) సీనియర్ నేత సుజన్ చక్రవర్తి, ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. ఇక బీజేపీ ఆరోపణలపై టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. పశ్చిమ బెంగాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు చాలా తేలికగా మారిందని అన్నారు. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు, ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పలువురి వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE