పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన పలు తెలంగాణ అంశాలు, సమస్యలపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగనివ్వకూడదని సీఎం కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. అలాగే లోక్సభ, రాజ్యసభ సమావేశాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాకోసం కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా ప్రస్తావించాలని సూచించారు. విభజన హామీలు నెరవేర్చడం, రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సీఎం ఎంపీలకు చెప్పారు.
అదేవిధంగా సమస్యలపై సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సప్లైస్ శాఖ సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలువాలని పార్టీ ఎంపీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కెఆర్ సురేశ్ రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ