తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్ నుంచి గన్పార్క్ వద్దకు చేరుకొని, అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ తో పాటుగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, తదితరులు అమరవీరులకు నివాళులర్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.
అమరవీరులకు నివాళుర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ రాజ్భవన్కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్కు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఘనంగా నిర్వహించారు. శాసనసభ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి వద్ద గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేశవరావు తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అమరవీరులకు నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu