తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 27, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే ఒకరు పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లగా ప్రస్తుతానికి 58 మందికి ప్రత్యేక ఐసొలేషన్ వార్డులో చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లు, మరియు హోం క్వారంటైన్ లలో సుమారు 20వేల మంది పర్యవేక్షణలో ఉన్నారు.
- మార్చ్ 27 , శుక్రవారం ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నిర్ధారణ.
- రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను ఏప్రిల్ 15 వరకు పొడిగింపు.
- లాక్డౌన్కు ప్రజల సహకారం బాగుంది, లేకపోతే పరిస్థితి భయంకరంగా ఉండేది.
- స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్యం పాటించడమే వ్యాధి నివారణకు ఏకైక మార్గం.
- అమెరికా, చైనా, స్పెయిన్, ఇటలీ స్థాయిలో కనుక మనదేశంలో వైరస్ వ్యాప్తి చెందితే 20 కోట్ల మందికి కరోనా వైరస్ సోకే అవకాశముందని పరిశీలకులు చెబుతున్నారు.
- ఇలాంటి ఆపత్కాల, ప్రతికూల పరిస్థితుల్లో స్వీయనియంత్రణే శ్రీరామరక్ష.
- ఒక్కోదశలో ఐసోలేషన్ వార్డుల్లో 11వేల మందిని ఉంచేందుకు వీలుగా 1400 ఐసీయూ సహా మొత్తం 12400 బెడ్లు సిద్ధంగా ఉన్నాం.
- 60వేల పాజిటివ్ కేసులు నమోదైనా కూడా చికిత్స చేసేలా చర్యలు చేపడుతున్నాం. వ్యాధి విజృంభించినా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం.
- హాస్టళ్ల బంద్ చేయొద్దని నిర్వాహకులకు ఆదేశాలిచ్చాం. ఎవరిని పస్తులతో, ఉపవాసంతో ఉంచడం జరగదు.
- ప్రజలంతా అధికారులు, పోలీసు, వైద్య సిబ్బందికి సహకరించాలి.
- ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జున సాగర్, జూరాల ఆయకట్టు కింద వ్యవసాయానికి ఏప్రిల్ 10 వరకు నీళ్లు ఇస్తాం.
- నిత్యావసర వస్తువుల వాహనాలకు అనుమతి ఇస్తున్నాం.
- చికెన్, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.