అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముందుగా ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో మొదలైన ఆందోళనలు క్రమంగా దేశమంతా వ్యాపించాయి. ఈ ఘర్షణలు, ఆందోళనల దాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం శుక్రవారం నాడు కొంత సమయం ఓ రహస్య స్థావరం (బంకర్) లో ఉండాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది. ప్రస్తుతం 40 నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఆరు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 1968లో మార్టిన్ లూథర్కింగ్(జూనియర్) హత్య తరువాత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయని, మళ్ళీ ఆ స్థాయిలో అమెరికాలో ఆందోళనలు జరగడం ఇప్పుడేనని పరిశీలకులు చెబుతున్నారు.
అగ్రరాజ్యంలో అల్లర్లపై వైట్ హౌస్ లోని రోజ్గార్డెన్ నుంచి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. పలు నగరాల్లో జరుగుతున్న అల్లర్లను అదుపు చేయడంలో గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అల్లర్లు జరుగుతున్న రాష్ట్రాల్లోకి నేషనల్ గార్డ్స్ను అనుమతించపోతే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. దేశంలో శాంతి, భద్రతలను కాపాడడం తన కర్తవ్యం అని, పరిస్థితులు చేయిదాటితే అందుకు తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఎక్కడా శాంతియుత నిరసనలు జరగడం లేదని, అవాంఛిత ఘటనలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ట్రంప్ పేర్కొన్నారు. పలు నగరాల్లో జరుగుతున్న అల్లర్లు, దోపిడీలు, దాడులను ఆపడానికి నేషనల్ గార్డ్స్ ను పంపిస్తున్నానని ప్రకటించారు. గవర్నర్లు వీలైనంత త్వరగా నేషనల్ గార్డ్స్ని రంగంలోకి దింపాలని ట్రంప్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu