ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది కాబట్టి రాష్ట్రంలో యాసంగిలో సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనమని ఖరాకండిగా చెప్పిన దరిమిలా, యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతు సోదరులకు స్పష్టంగా చెబుతున్నానని అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్రం ధాన్యం సేకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ విషయంలో కేంద్రంతో పేగులు తెగేదాకా కొట్లాడామని, స్వయంగా మూడు, నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లి చర్చించానని అన్నారు. కనీసం పదిహేను సార్లు రాష్ట్ర అధికారులు, ఆరుసార్లు మంత్రులు, ఎంపీల బృందం వెళ్లి చర్చించినా నిరాశే మిగిలిందన్నారు.
అంతే కాకుండా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. కేంద్రం సామాజిక బాధ్యత మరచి, చిల్లరకొట్టు షావుకారులా లాభనష్టాలు లెక్కేసుకుంటున్నదని, కేంద్రంలో ఆ పార్టీ పాలనను పారదోలితేనే దేశానికి విముక్తి లభిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ