హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలోని ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరిస్తుండగా, కొత్తగా ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ లలో మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇటీవలే టిమ్స్ ఎల్బీనగర్ (రూ.900 కోట్లు), టిమ్స్ అల్వాల్ (రూ.897 కోట్లు), టిమ్స్ సనత్నగర్ (రూ.882 కోట్లు) ఆసుపత్రుల నిర్మాణానికి మొత్తం రూ.2,679 కోట్లు కేటాయిస్తూ పరిపాలనపరమైన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ లలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఏప్రిల్ 26, మంగళవారం) శంకుస్థాపన చేయనున్నారు. సనత్నగర్, ఎల్బీనగర్ ఆసుపత్రులను జీ+14 విధానంలో, అల్వాల్ లో జీ+5 విధానంలో నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తుంది.
ఇక ఏప్రిల్ 26న అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్బంగా, ఆసుపత్రి నిర్మించనున్న ప్రదేశాన్ని ఆదివారం నాడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి మల్లారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు మంత్రి హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. సనత్నగర్, ఎల్బీనగర్ లలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యశాఖ అధికారులు పర్యటించి ఆసుపత్రుల నిర్మాణ స్థలం, ఏర్పాట్లను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ