జాతీయస్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 20, శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అలాగే దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను సీఎం కేసీఆర్ కలిసి వారిని పరామర్శించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన వివరాలను వెల్లడించారు.
ముందుగా మే 20, శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తారు. మే 22వ తేదీన మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం కేసీఆర్ చేపట్టనున్నారు. జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యాణా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులను అందచేస్తారు.
మే 26న బెంగుళూరు, మే 27న రాలేగావ్ సిద్ది పర్యటన:
ఇక మే 26, గురువారం ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. అలాగే బెంగుళూరు నుంచి మే 27వ తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం సీఎం షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు సీఎం చేరుకుంటారు. అనంతరం మే 29 లేదా 30వ తేదీన పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్ సంసిద్దం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF