తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా కరోనా పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే, రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, డీఎం ఈ రమేష్ రెడ్డి, సీఎం వోఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాదికరులు, సీపీ తరుణ్ జోషి, జిల్లాకు చెందిన పలువురు నాయకులున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ