తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఈ రోజు అపూర్వ ఘట్టానికి వేదిక అవుతోంది. క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఈరోజు నుంచి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ అద్భుత కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సతీసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం చెప్పారు. ఈ ఉదయం మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి.
సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా స్వయంభువుల తొలి పూజలో పాల్గొననున్నారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి లక్ష్మీనారసింహుడికి ఆరాధనలు జరిపిన అనంతరం, స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించగా, నిన్న రాత్రి నుంచి అక్కడ దర్శనాలు ఆపేశారు. ఈ మధ్యాహ్నం 12 తర్వాత ప్రధానాలయంలోనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 3 గంటల సమయంలో హైదరాబాద్కు సీఎం తిరిగి పయనమవనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పలువురు ముఖ్య నేతలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ