హైదరాబాద్ లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ కు తుది అనుమతులు లభించాయి. మెట్రో రైల్ సేఫ్టీ (సిఎంఆర్ఎస్) కమిషనర్ జేకే గార్గ్ గత 3 రోజులుగా హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్లు మరియు ఎల్ అండ్ టిఎమ్ఆర్ఎల్ సాంకేతిక నిపుణులతో కలిసి జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ 2 లో తనిఖీలు నిర్వహించి భద్రతా ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. వయాడక్ట్, ట్రాక్, సిగ్నలింగ్, టెలికాం, రైళ్లు, మరియు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్కు సంబంధించిన అన్ని భద్రతా పరీక్షలను నిర్వహించారు. అలాగే విద్యుత్, అగ్నిమాపక, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రాక్స్ కు సంబంధించి అధికారులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1లో చివరిదైన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ లో ప్రయాణీకుల సేవలను త్వరలోనే ప్రారంభించనున్నారు. 11 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్లో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్ , సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ వంటి 9 స్టేషన్లు ఉన్నాయి. భద్రత కమిషనర్ జేకే గార్గ్ నుంచి భద్రతా పత్రం అందుకున్న అనంతరం ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కారిడార్ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వం త్వరలో నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
[subscribe]