దేశంలో పలు ప్రాంతాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ), ఎన్పీఆర్ లపై చర్చించి, వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఏఏ ఒక విభజించే చట్టమని, అలాగే 2020-ఎన్పీఆర్ ఎన్ఆర్సీకి మారువేషమని సోనియాగాంధీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీని వేరే ఆలోచన లేకుండా తోసిపుచ్చిన కాంగ్రెస్ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని, అలాగే ఈ దిశగా ప్రయత్నించిన రాహుల్, ప్రియాంక గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వివాదాస్పద సీఏఏ, ఎన్ఆర్సీలను బీహార్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని ప్రశాంత్ కిషోర్ పునరుద్ఘాటించారు.
[subscribe]