ఏ రాష్ట్రంలో అయినా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించేదెవరు? ఖాళీలు ఎన్ని ఉన్నాయో గుర్తించేదెవరు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రకటనలు సాధ్యమా? ఈ ప్రశ్నలకు జవాబులను పరిశీలిస్తే కచ్చితంగా కాదనే సమాధానమే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న – జవాబులు ఏంటని అనుకుంటున్నారా? ఉద్యోగాలు కావాలంటే ప్రశ్న, జవాబులు ఎదుర్కోవడం తప్పనిసరి. కానీ.. కాంగ్రెస్ మాత్రం అన్ని ప్రశ్నలనే మిగులుస్తోంది. విద్యార్థులను గందరగోళానికి, ఆందోళనకు గురి చేస్తోంది. ఓట్ల కోసం ఆటలాడుతోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలు గుప్పిస్తూ.. ఏకంగా నోటిఫికేషన్ల తేదీలను కూడా అందులో పేర్కొంది. అంటే.. రాజ్యాంగబద్ద సంస్థ అయిన టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన ఆ నోటిఫికేషన్లను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ రద్దు చేస్తుందా? అసలు ఓ రాజకీయ పార్టీ నోటిఫికేషన్లను ఎలా ప్రకటిస్తుంది.. అది ఎంత వరకు ఆచరణ సాధ్యం? వంటి ప్రశ్నలెన్నో విద్యార్థులను కలవరానికి గురి చేస్తున్నాయి.
ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్నో హామీలు ఇస్తాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మేనిఫెస్టోలో పొందుపరుస్తాయి. అందులో ఉద్యోగ అవకాశాల అంశాలు ఉండొచ్చు. కానీ.. కాంగ్రెస్ ఏకంగా జాబ్ కేలండర్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం కోసం.. యువతను మోసం చేసేలా ఆ పార్టీ తీరు ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చెబుతున్న ఆ జాబ్ కేలండర్ను, జాబ్ కేలండర్ పేరుతో వస్తున్న ప్రకటనలను పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ ప్రకటనలో పేర్కొంది. అసలు రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని ఖాళీలు ఉన్నాయా, ఏయే విభాగాల్లో ఎన్ని ఉన్నాయి.. అనే అంశాలను పరిశీలించకుండానే.. అధికారంలో కూడా లేని కాంగ్రెస్ అంత బహిరంగంగా నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తుంది. అసలు ఓ రాజకీయ పార్టీకి ఆ అధికారం ఎక్కడిది అనేది విషయాలను పరిశీలిస్తే అర్థం అయిపోతుంది. అదంతా పొలిటికల్ డ్రామా అని. అధికారం కోసం యువత జీవితాలతో చెలగాటం అడుతోందని.
జాబ్ కేలండర్ లో ఉద్యోగాల పేర్లతో సహా నోటిఫికేషన్ తేదీలు ఫేజ్ -1, ఫేజ్ 2 అంటూ కాంగ్రెస్ ప్రకటించింది. అసలు ఆయా శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండే పరిస్థితి లేదు. కానీ ఇది కాంగ్రెస్ గ్యారంటీ అంటూ ఆ ప్రకటనల్లో పేర్కొంది. దీనికితోడు.. 2024 మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలొచ్చే అవకాశముంది. ఎన్నికల కోడ్ సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వడం అసాధ్యం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలో 2024 ఫిబ్రవరి నుంచి మే వరకు నోటిఫికేన్ల తేదీలను ప్రకటించింది. అంటే అది యువతను, నిరుద్యోగులను మోసం చేయడమే అన్నది స్పష్టం అవుతుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చింది లేదు. కానీ.. ఇక్కడ అధికారంలోకి రాక ముందే ఏడాదికి రెండు లక్షలు ఇస్తామని నోటిఫికేషన్ ప్రకటించేసింది. అంటే ఇది ఎన్నికల స్టంటే అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంకో విషయం ఏంటంటే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ -1 ఉద్యోగాల సంఖ్య 503 మాత్రమే అని టీపీఎస్సీసీ పేర్కొంటూ, ఆ ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. మరి అలాంటిది ఖాళీ పోస్టులు లేకుండా మళ్లీ గ్రూప్ -1 నోటిఫికేషన్ను ఎలా విడుదల చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మళ్లీ నోటిఫికేషన్ జారీచేయడమంటే పాత నోటిఫికేషన్ను రద్దుచేయడమే. అంటే నిరుద్యోగులను మళ్లీ మోసగించడంలో భాగమేనన్నది సుస్పష్టం. ఒక వేళ అదే జరిగితే కొందరు కోర్టుకెళ్లే అవకాశం ఉంది. అంటే వివాదాలు సృష్టించి.. ఉన్న ఉద్యోగాలు భర్తీ కాకుండా.. కొత్తవి ఇవ్వకుండా కేసుల పేరు చెప్పి కాలయాపన చేసే అవకాశం ఉందని అర్థం అవుతోంది.
అలాగే ఇప్పటికే గ్రూప్ -2లో ఖాళీగా ఉన్న 783, గ్రూప్ -3 క్యాడర్లోని 1,365 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల్లో ఖాళీలు ఉత్పన్నమయ్యే సమస్యేలేదు. ఏడాదికి ఒకసారి గ్రూప్ – 1, ఏడాది రెండుసార్లు గ్రూప్ 2, 3,4 నిర్వహిస్తామని చెప్పడం ఆచరణసాధ్యం కూడా కాదు. అంతేకాకుండా.. జూనియర్, పాలిటెక్నిక్ డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కొన్నింటికి పరీక్షలు సైతం నిర్వహించారు. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన క్యాలెండర్లో కాలేజీ కమిషన్ రిక్రూట్ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఇలాంటి నియామక సంస్థ అనేదే లేదు. ఇదంతా ఓట్ల కోసమే అన్నది స్పష్టం అవుతోంది. అందుకేనేమో.. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో భట్టి విక్రమార్క సంతకం పెట్టనిది.!!
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE